అర్జున అవార్డు అందుకున్న హుస్సముద్దీన్

by Disha Web Desk 22 |
అర్జున అవార్డు అందుకున్న హుస్సముద్దీన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డు దక్కింది. ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడైన హుస్సముద్దీన్‌ను అర్జున అవార్డు వరించింది. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. ఇందూర్ ముద్దుబిడ్డ బాక్సింగ్ క్రీడాకారుడు హుస్సముద్దిన్ ఖాతాలో ఎన్నో పతకాలు చేరగా తాజాగా అర్జున అవార్డు వరించింది. 2023 ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే హుస్సముద్దీన్‌ను అర్జున అవార్డుకు ఎంపిక చేశారు.

జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ పోటీల్లో ప్రతిభ చూపుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తమ ప్రతిభ చూపుతూ అవార్డులు కైవసం చేసుకుంటున్న విషయం తెల్సిందే. హుసాముద్దీన్ బాక్సింగ్‌లో ఓనమాలు తన తండ్రి సంసుద్దిన్ వద్ద నేర్చుకున్నాడు. బాక్సింగ్ క్రీడాకారిణి నిఖ్ఖత్ జరీనాకు సైతం ఓనమాలు నేర్పించింది సంసుద్దీన్. ఎంతోమంది క్రీడాకారులకు నిజామాబాద్ నగర బొడ్డులోని పాత కలెక్టరేట్ మైదానంలో తర్పీదు ఇచ్చారు. తన వద్ద శిక్షణ పొందిన వారు ఎంతో మంది బాక్సింగ్‌లో రాణించారు. నిఖ్ఖత్ జరీనా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు సాధించింది. జిల్లాకే చెందిన నిఖ్ఖత్ జరీన్‌కు గతేడాది అర్జున అవార్డు దక్కిన విషయం తెల్సిందే. మహిళల బాక్సింగ్ పోటీల్లో ప్రపంచ చాంపియన్ గా నిలవడంతో నిఖ్ఖత్ జరీన్‌కు అర్జున అవార్డు దక్కింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంసుద్దీన్ శిష్యులు ఇద్దరు అర్జున అవార్డు సాధించడం విశేషం.

Next Story

Most Viewed